Uttar Pradesh: యూపీలో భారీ ఎన్‌కౌంటర్..

లారెన్స్ బిష్ణోయ్ ముఠా షార్ప్‌షూటర్ నవీన్ హతం;

Update: 2025-05-29 04:15 GMT

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పోలీసు ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన కీలక సభ్యుడు, షార్ప్‌షూటర్ నవీన్‌కుమార్‌ ప్రాణాలు కోల్పోయాడు. అతడిపై హత్యలు, దోపిడీలు సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో మరోసారి లారెన్స్ బిష్ణోయ్ ముఠా కార్యకలాపాలు చర్చనీయాంశమయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్‌ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), దిల్లీ పోలీసులు గురువారం సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు నవీన్‌కుమార్‌ అక్కడికి చేరుకున్నాడు. పోలీసులను గమనించిన వెంటనే వారిపై కాల్పులకు తెగబడ్డాడని, అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోవడానికి విఫలయత్నం చేశాడని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపగా నవీన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మరణించిన నవీన్‌కుమార్‌ను ఘజియాబాద్ జిల్లా పరిధిలోని ‘లోని’ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో నవీన్‌కుమార్ షార్ప్‌షూటర్‌గా చురుగ్గా వ్యవహరిస్తున్నాడని, ముఠాలోని మరో కీలక సభ్యుడు హషీం బాబాతో కలిసి పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అతడపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి సుమారు 20 కేసులు నమోదై ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

లారెన్స్ బిష్ణోయ్ ముఠా గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పలు నేర కార్యకలాపాలతో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ ముఠా నుంచి అనేకసార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, సల్మాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని కూడా ఈ ముఠా సభ్యులే దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే సెల్‌ఫోన్ల ద్వారా తన అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ నేరాలకు, హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్‌కుమార్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News