Liberian Cargo Ship: కొచ్చి తీరంలో మునిగిన నౌక లో ప్రమాదకర కెమికల్స్!

| కేరళలో హై అలర్ట్‌..;

Update: 2025-05-26 02:15 GMT

లైబీరియా దేశానికి చెందిన ఓ భారీ సరకు రవాణా నౌక కేరళ సముద్ర తీరానికి సమీపంలో పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ ఘటనతో సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. భారత తీర రక్షక దళం (ఐసీజీ) ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా కాపాడారు.

కొచ్చి తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎస్‌సీ ఎల్సా-3 అనే పేరు గల ఈ 184 మీటర్ల పొడవైన నౌక తొలుత ఒక వైపునకు ఒరిగిపోయింది. ఆ సమయంలో కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. తాజాగా, నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయిందని ఐసీజీ అధికారులు వెల్లడించారు.

ఈ నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉన్నాయని, వీటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉందని, మిగిలిన వాటితో పాటు నౌకలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రసాయనాలు, ఇంధనం సముద్రంలో కలిస్తే తీవ్ర పర్యావరణ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో కొచ్చి తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లు గానీ, బయటకు వచ్చిన ఇంధనం గానీ తీరం వైపు కొట్టుకువస్తే వాటిని తాకవద్దని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం ఎంతమేరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి 'ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్న విమానం నిరంతరం గగనతలంలో పర్యవేక్షిస్తోందని అధికారులు వివరించారు.

విఝింజం పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన ఈ నౌక, శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, మార్గమధ్యంలోనే ఈ దుర్ఘటన జరిగింది. నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన భారత తీర రక్షక దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటన వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. సముద్ర కాలుష్యాన్ని వీలైనంతగా నివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News