Lpg Gas : డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50 వడ్డింపు
సామాన్యుడిపై మరో భారం,;
పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇప్పటికే కుదేలైన పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్రంలోని మోదీ సర్కారు మరో పిడుగు వేసింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 50 పెంచింది. ఈ మేరకు సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. నాన్ సబ్సిడీ వినియోగదారులతో పాటు సబ్సిడీ గ్యాస్ అందుకొంటున్న ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని మంత్రి తెలిపారు.
సీఎన్జీపై రూ.1 పెంపు
కిలో సీఎన్జీపై రూ. 1 పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతవారం ఇన్పుట్ సహజ వాయువు ధరలను ప్రభుత్వం దాదాపు 4 శాతం పెంచిన నేపథ్యంలో తాజాగా సీఎన్జీ ధరలను కిలోకు రూ.1 చొప్పున పెంచింది. ఇది దేశ రాజధానితోపాటు ఇతర నగరాలకు వర్తిస్తుంది. ఢిల్లీలో కిలో సిఎన్జీ ధర రూ. 75.09కి చేరుకుందని నగరానికి చెందిన గ్యాస్ రిటైలర్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఎక్స్ వేదికగా తెలిపింది.
పదకొండేండ్లూ భారమే
2014లో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 2014లో రూ. 399గా ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర.. తాజా పెంపుతో రూ. 920కు చేరింది. అంటే పదకొండేండ్ల వ్యవధిలో గ్యాస్ ధరలు ఏకంగా 130. 57 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడిచమురు ధర నాలుగేండ్ల కనిష్ఠానికి చేరినప్పటికీ, దేశీయంగా ఇంధన ధరలను మాత్రం కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సవరించకపోగా గ్యాస్ ధరలను పెంచింది. దీంతో కేంద్ర సర్కారు వైఖరిపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.