Vijay: పుదుచ్చేరి విజయ్ సభలో గన్ కలకలం..

శివగంగ జిల్లా కార్యకర్త అరెస్ట్

Update: 2025-12-09 05:45 GMT

పుదుచ్చేరి కేంద్రంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి పబ్లిక్ మీటింగ్‌లోకి వస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సభలో ఒక కార్యకర్త తుపాకీతో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివగంగ జిల్లా కార్యకర్తగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే కరూర్ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. తొలుత ఇరుకైన వీధులు, ఇరుకైన దారులు ఉన్నాయంటూ రోడ్‌షోకు, బహిరంగ సభకు పుదుచ్చేరి పోలీసులు అనుమతి నిరాకరించారు. మొత్తానికి కఠినమైన షరతులతో విజయ్ రోడ్‌షోకు అనుమతి ఇచ్చారు.

భద్రతా కారణాల దృష్ట్యా పొరుగున ఉన్న తమిళనాడు నుంచి ప్రజలు రావద్దని పోలీసులు ముందే సూచించారు. సభా ప్రాంగణంలోకి పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రవేశం నిరాకరించారు. పార్టీ జారీ చేసిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. తాగునీరు, అంబులెన్సులు, ప్రథమ చికిత్స బృందాలను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు విజయ్ రోడ్ షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు, కేవలం సభకు మాత్రమే కఠిన షరతులతో కూడిన అనుమతినిచ్చారు.

విజయ్.. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరిలో కూడా మద్దతు కూడా బెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు పుదుచ్చేరిలో పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక పుదుచ్చేరి రోడ్‌షో అయిపోయిన తర్వాత ఈనెలాఖరు నుంచి తమిళనాడు వ్యాప్తంగా విజయ్ పర్యటనలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం మృతుల కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత విజయ్ మళ్లీ పబ్లిక్‌లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా మీడియా కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది.

Tags:    

Similar News