Massive Traffic Jam: హైవేపై 12 గంటలు ట్రాఫిక్ జామ్.. చిక్కుకుపోయిన 500 మంది విద్యార్థులు
5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులే ..
దేశంలోని పలు ప్రధాన జాతీయ రహదారులపై ఇటీవలే భారీగా ట్రాఫిక్ జామ్లు నెలకొంటున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇటీవలే ఢిల్లీ-గురుగ్రామ్, ఢిల్లీ-కోల్కతా హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబై-అహ్మదాబాద్ హైవేపై వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో దాదాపు 12 గంటలుగా 500 మందికిపైగా విద్యార్థులు , వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గల ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై దాదాపు 12 గంటల పాటూ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ముంబై, థానే సహా సమీప ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న సుమారు 500 మందికిపైగా విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. వారంతా 5 నుంచి 10వ తరగతి చదువుతున్నవారే. విద్యార్థులను తీసుకెళ్తున్న 12 బస్సులు నిన్న సాయంత్రం 5:30 గంటల నుంచి ట్రాఫిక్లోనే నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. పలువురు స్కూల్ విద్యార్థులు పిక్నిక్ నుంచి తిరిగి వస్తున్నట్లు చెప్పారు. గంటల పాటు వాహనాలు ఎటూ కదలడానికి వీలులేకపోవడంతో బుధవారం ఉదయం వరకూ ఆహారం, నీళ్లు లేక వారంతా తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొందరు స్థానికులు ట్రాఫిక్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వాహనదారులకు స్నాక్స్, నీళ్లు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ఠాణె జాతీయ రహదారిపై కొన్ని మరమ్మతు పనులు జరుగుతుండడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.