Meerut Murder: భర్త సొమ్మునిచ్చి.. ప్రియుడితో బెట్టింగ్

మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో కీలక విషయాలు;

Update: 2025-03-24 04:00 GMT

ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని మేరఠ్‌లో చోటుచేసుకున్న మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. ఈసందర్భంగా పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్‌ శుక్లాకు ఇచ్చినట్లు తెలిసింది. ఆ సొమ్ముతో బెట్టింగ్‌ ఆడించి వచ్చిన డబ్బుతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు పోలీసువర్గాల సమాచారం.

మరోవైపు వీరిద్దరు జైలులో కూడా డ్రగ్స్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ బానిసలు కావడంతో, అవి లేకపోవడంతో తీవ్రంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచినప్పటికీ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని జైలు వర్గాలు చెప్పాయి. నిందితులు ఇద్దరిని జైలులోని డీ అడిక్షన్ సెంటర్‌లో పరిశీలనలో ఉంచారు. వీరి పరిస్థితి మరింత దిగజారితే వైద్య పర్యవేక్షణలో ఉంచవచ్చు. ఈ లక్షణాలు స్థిరీకరించడానికి 8-10 రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, డ్రగ్స్ లేనిదే ఆహారం తీసుకోమని చెబుతున్నట్లు తెలుస్తోంది

సాహిల్ ముస్కాన్‌కి డ్రగ్స్ అలవాటు చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. ఇద్దరూ డ్రగ్స్ ఇంజెక్షన్స్, ఇతర పదార్థాలకు బానిసలయ్యారు. ముస్కాన్, సాహిల్‌ని మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలులో ఉంచారు. వీరిద్దరు కలిసి ఉండాలని కోరకున్నప్పటికీ, జైలు నిబంధనల ప్రకారం వారిని విడివిడిగా ఉంచారు. ముస్కాన్ మహిళ బ్యారక్‌లో, సాహిల్ పురుషులు బ్యారెక్‌లో ఉన్నాడు.

జైలులోకి ప్రవేశించినప్పటి నుంచి ముస్కాన్ ముఖంలో స్పష్టంగా బాధ కనిపిస్తోంది. ఆమె రాత్రి నిద్ర పోకుండా, తినడానికి నిరాకరిస్తోంది. అయితే, ఆమెను జైలు అధికారులు ఒప్పించి ఆహారం తీసుకునేలా చేశారు. మరోవైపు సాహిల్ మౌనంగా ఉంటున్నాడు. కానీ, బహిరంగంగా డ్రగ్స్ డిమాండ్ చేస్తున్నాడు. ఖైదీలకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీనియర్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. ముస్కాన్ మరియు సాహిల్ ఇద్దరూ నిశిత పరిశీలనలో ఉన్నారు. జైలు అధికారులు వీరికి డీ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News