Raja Raghuvanshi: రాజా రఘువంశీ మరణానికి కొన్ని నిమిషాల ముందు వీడియో వైరల్..
చివరి వీడియోలో కీలక దృశ్యాలు;
హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మేఘాలయలో సోనమ్, రాజా కలిసి రికార్డు చేసుకున్న చివరి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో భార్య సోనమ్ ధరించి కనిపించిన షర్ట్.. రాజా మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు వారీ వీడియోను తీసుకున్నట్టు తెలిసింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
ఈ వీడియోలో సోనమ్ ఒక షర్ట్ ధరించి కనిపించింది. అదే షర్ట్ను పోలీసులు ఆమె భర్త మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కనుగొన్నారు. దీంతో ఈ షర్ట్ కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ షర్ట్ అక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఏం జరిగిందనేది అంతుచిక్కకుండా ఉంది.
ప్రస్తుతం పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోనమ్ను కూడా విచారించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చివరి వీడియో, ఘటనా స్థలంలో లభించిన షర్ట్ ఆధారంగా రాజా మృతికి గల కారణాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీడియో ఎవరు తీశారు..
రాజా రఘువంశీ, సోనమ్ మేఘాలయకు హనీమూన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జికి వెళ్లిన సమయంలో దేవ్ సింగ్ అనే పర్యాటకుడు సోనమ్, రఘువంశీ కొండపైకి వెళ్తున్న వీడియోను తీశాడు. అతను తాజాగా.. వీడియోను తన ఇన్ స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే 23వ తేదీ ఉదయం 9.45గంటల సమయంలో ఈ వీడియో తీసినట్లు పేర్కొన్నాడు.
కొత్త వీడియోలో ఏముందంటే..?
దేవ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన వీడియోలో రఘువంశీ, సోనమ్ కొండపైకి ఎక్కుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో గురించి దేవ్ సింగ్ తన ఇన్స్టాలో ఈలా రాశాడు.. ‘‘నేను 2025 మే 23న మేఘాలయ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జికి ప్రయాణించాను. ఆ సమయంలో ఈ వీడియోను రికార్డ్ చేశాను. నిన్న నేను వీడియోలను తనిఖీ చేస్తున్నప్పుడు, ఇండోర్ జంట రికార్డింగ్ నాకు దొరికింది. ఆరోజు ఉదయం 9:45 గంటల ప్రాంతంలో మేము నోగ్రియాట్ గ్రామంలో రాత్రి బస చేసిన తర్వాత కిందకు వెళ్తున్నాము. రఘువంశీ, సోనమ్ జంట పైకి వెళ్తున్నారు. ఇది ఆ జంట యొక్క చివరి వీడియో అని నేను అనుకుంటున్నాను. సోనమ్ రాజా దగ్గర దొరికిన అదే తెల్ల చొక్కా ధరించింది. ఇది మేఘాలయ పోలీసులకు వారి విచారణలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.’’ అని దేవ్ సింగ్ రాశాడు.