Mobile Internet: జార్ఖండ్‌లో రెండు రోజులు ఇంటర్నెట్ బంద్

పరీక్షల్లో అక్రమాల భయం;

Update: 2024-09-22 04:45 GMT

శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పుకార్లు వ్యాపించకుండా మొబైల్‌ ఇంటర్నెట్‌ను బంద్‌ చేయడం గురించి చాలాసార్లు విన్నాం. కానీ, జార్ఖండ్‌ ప్రభుత్వం మాత్రం పరీక్షల్లో అక్రమాల భయంతో మొబైల్‌ ఇంటర్నెట్‌ను ఆపేయాలని నిర్ణయించింది. పరీక్షల కోసం ఇలాంటి ముందు జాగ్రత్త చర్య తీసుకోవడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి.జార్ఖండ్‌ జనరల్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌(జేజీజీఎల్‌సీసీఈ) పరీక్షలు శనివారం, ఆదివారాల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పరీక్ష జరిగే రెండు రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఎక్స్‌, టెలిగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి మొబైల్‌ యాప్‌లను ఉపయోగించి గతంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్ట్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News