వంద రోజుల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టుపై తాము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డిబేట్కు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు అభివృద్ధి ఇంకా ముందుందని వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోడీ పాలన మెచ్చి ప్రజలు పట్టం కడితే కాంగ్రెస్, రాహుల్ జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారంతో దాడి చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుండా, విదేశాలకు వెళ్లి అక్కడ దేశంపై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోడీపై నిందలు వేయడం ఆయనకు పరిపాటిగా మారిందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు.