Lok sabha: జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు..

జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు;

Update: 2025-06-04 07:45 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మూడు నెలల విరామం తర్వాత ఉభయ సభలు ప్రారంభం అవుతున్నాయి. పార్లమెంట్, రాజ్యసభ ఉదయం 11 గంటలతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక వర్షాకాల సమావేశాల్లో విధానపరమైన అంశాలు, పెండింగ్‌లో ఉన్న చట్టాలు, రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే ఈ పరిణామాలపై చర్చించేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కానీ అందుకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో ఈ అంశాలపై కేంద్రాన్ని ప్రతిపక్షం నిలదీసేందుకు సన్నద్ధమవుతోంది. అయితే అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిరణ్ రిజిజు తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగం కోసం సప్లిమెంటరీ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీగా బడ్జె్ట్‌ను రెట్టింపు చేసి రక్షణ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ఆలోచిస్తోంది.

Tags:    

Similar News