Madhya Pradesh: రాజారామ్ మోహన్ రాయ్ ‘‘బ్రిటిష్ ఏజెంట్’’.. మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి
బీజేపీ మంత్రి పర్మర్ వివాదాస్పద వ్యాఖ్యలు
మన దేశ సంఘ సంస్కర్లల్లో ప్రముఖుడైన రాజా రామ్ మోహన్ రాయ్పై బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనో బ్రిటిష్ ఏజెంట్ అని, బ్రిటీషర్ల ప్రయోజనాల కోసం పనిచేశారని పర్మర్ ఆరోపించారు. అగర్మాల్వాలో శనివారం జరిగిన బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో పర్మర్ మాట్లాడుతూ రామ్ మోహన్ రాయ్ కులం ప్రాతిపదికన భారత సమాజంలో చీలిక తెచ్చేందుకు బ్రిటీష్ ఏజెంట్గా పని చేశారని విమర్శించారు.
ఆ సమయంలో మన దేశంలో ఆంగ్ల విద్య ద్వారా మత మార్పిడి జోరుగా సాగుతోందని, బ్రిటీష్ వారు రాయ్ సహా అనేక మంది సంస్కర్తలను బానిసలుగా చేసుకున్నారని ఆరోపించారు. ఈ అరాచకాన్ని విచ్ఛిన్నం చేసి గిరిజనులకు గుర్తింపు తెచ్చి, సమాజాన్ని రక్షించిన మహానుభావుడు బిర్సా ముండా అని ఆయన ప్రశంసించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా తీవ్రంగా ఖండించారు. అసలు పర్మర్కు చరిత్ర తెలుసా? సతీ సహగమనాన్ని రద్దు చేయించడం కూడా బ్రిటీష్ బ్రోకరేజ్ లాంటిదేనా? అని ప్రశ్నించారు.