Nagpur Incident: మనవడిపై మరుగుతున్న నీళ్లు పోసిన బామ్మ..
45 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలుడు
రంగుల పండుగ హోలీ వేళ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన మనవడిపై ఒక బామ్మ మరుగుతున్న వేడి నీళ్లను కుమ్మరించింది. ఈ అమానుష ఘటనలో ఆ బాలుడు కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
నాగ్పూర్ లోని కోరాడి ప్రాంతంలో హోలీ పండుగ రోజు పిల్లలు వీధిలో రంగులు చల్లుకుంటున్నారు. వేడి నీళ్ల బకెట్ తో వీధిలో నుంచి ఇంట్లోకి వెళుతున్న బామ్మపై నాలుగేళ్ల మనవడు రంగులు చల్లాడు. అడ్డుకునే ప్రయత్నంలో తన చేతిలో ఉన్న బకెట్ లో నీళ్లను బాలుడిపై కుమ్మరించింది. దీంతో ఆ బాలుడి శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. బాలుడి అరుపులతో వేడి నీళ్లు కుమ్మరించినట్లు గుర్తించిన బామ్మ.. వెంటనే పక్కనే ఉన్న బకెట్ లో నుంచి చన్నీళ్లు తీసుకుని మనవడిపై కుమ్మరించింది. గాయాలు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరాడి పోలీసులు నిందితురాలైన నానమ్మపై కేసు నమోదు చేశారు. అయితే, బకెట్ లో వేడి నీళ్లు ఉన్న విషయం ఆమె మరిచినట్లు అనిపిస్తోంది. అంతకుముందు ఆమె రోడ్డు చిమ్మడం, బకెట్ లోని నీళ్లను రోడ్డుపై పారబోయడం వీడియోలో కనిపించింది.