Shubhanshu Shukla: రేపే నింగిలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..

వాయిదాల పర్వానికి ఫుల్‌స్టాప్‌ పడేనా?;

Update: 2025-06-24 00:45 GMT

భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రపై నాసా కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. వాయిదాల పర్వానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ కొత్త తేదీని ప్రకటించింది. ఈ నెల 25న యాక్సియం-4 మిషన్‌ను చేపడుతామని వెల్లడించింది. మిషన్‌ భాగంగా బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ను ప్రయోగిస్తామని తెలిపింది. ఇది శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌కు మోసుకెళ్లనుంది. ఈ మిషన్‌కు పైలట్‌గా శుభాంశు వ్యవహరించనున్నారు. ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత అంటే జూన్‌ 26న సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం  అవుతుంది. 14 రోజులపాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు.

శుభాంశు శుక్లా రోదసి యాత్రపై వాయిదాలు పడుతూ వస్తున్నది. ‘ఏఎక్స్‌-4’ మిషన్‌ (Ax 4 mission)లో భాగంగా నాసా, ఇస్రో, అమెరికాకు చెందిన ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ యాక్సియం  చేపడుతున్న ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం మే 29న జరగాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌ 10, జూన్‌ 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్‌-9 రాకెట్‌ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్‌ లీకేజ్‌ కారణంగా జూన్‌ 11న జరగాల్సిన ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు. లీకేజీకి సంబంధించిన మరమ్మత్తులు పూర్తిచేసేందుకు మరింత సమయం పట్టడంతో ప్రయోగాన్ని జూన్‌ 19కి పోస్ట్‌పోన్‌ అయింది. అయితే ఈ నెల 22న చేపట్టున్నట్లు ప్రకటించినప్పటికీ అది మళ్లీ వాయిదా పడింది. తాజాగా జూన్‌ 25న ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు నాసా ప్రకటించింది.

కాగా, ఈ మిషన్‌ ద్వారా భారత్‌, పోలండ్‌, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్‌ రోదసి యాత్ర ద్వారా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News