Modi : ఎన్డీయే నాయకుడిగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక
ఆపద్ధర్మ కేంద్ర కేబినెట్కు రాష్ట్రపతి విందు;
లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన ఎన్డీయే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. నేడు జరిగిన సమావేశంలో...ఎన్డీయే పక్ష నేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్డీయే పక్ష నేతలు ఓ తీర్మానం ఆమోదించారు. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేంద్ర కేబినెట్ చివరిభేటీ లోక్సభ రద్దుకు చేసిన సిఫారస్ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి-NDAపక్ష నేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో...ఈ మేరకు ఎన్డీయే పక్షాల నేతలు ఓ తీర్మానం ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో...21పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్, శివసేన అధినేత ఏక్ నాథ్ శిందే, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్, రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరీ, UPPL, హిందుస్థాన్ అవామీ మోర్చా అధినేతలు...ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాల కారణంగా పదేళ్లలో దేశంలోని 140 కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు...ఓ తీర్మానం ఆమోదించారు. దాదాపు 6దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు...ఎన్డీయే నేతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలో NDA ఐక్యంగా పోరాడి విజయం సాధించినట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలోని NDA ప్రభుత్వం... పేదలు, మహిళలు, యువత, రైతులు, అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు...పేర్కొన్నారు. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా... దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి NDA ప్రభుత్వం...నిరంతరం కృషి చేస్తుందని...ఎన్డీయే నేతలు తెలిపారు.
మరోవైపు...ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ...హస్తిన పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. దిల్లీ కర్తవ్యపథ్లో మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ చివరి సమావేశం...లోక్సభ రద్దుకు సిఫారస్ చేసింది. అనంతరం ప్రధాని మోదీ...రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదిముర్మును కలిశారు. తనతోపాటు కేంద్రమంత్రుల రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము...కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ పదవిలో కొనసాగాలని...ప్రధాని మోదీకి సూచించారు.
2014 ఎన్నికల్లో 282 స్థానాలు, 2019లో 303 సీట్లతో...సొంతంగా మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ...ఈసారి చార్ సౌ పార్ అంటూ నినదించినా మెజార్టీకి అవసమైన స్థానాలు సొంతంగా సాధించలేకపోయింది. 240స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే 32 స్థానాలు తగ్గాయి.దీంతో ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన 53మంది ఎంపీల మద్దతుతో ...ప్రధాని మోదీ మూడోసారి...హస్తిన పగ్గాలు చేపట్టనున్నారు