Kanpur: నీట్ విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం..
బ్లాక్మెయిల్ చేస్తూ నెలల పాటు అఘాయిత్యం..;
నీట్ కోచింగ్ సెంటర్ టీచర్లు ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. మరో విద్యార్థినిని ఒక టీచర్ లైంగికంగా వేధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ధైర్మం చేసిన ఆ యువతి టీచర్లపై ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. 2022లో ఒక బాలిక నీట్ ప్రిపరేషన్ కోసం కాన్పూర్లోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో చేరింది. ఈ ఏడాది జనవరిలో బయోలజీ టీచర్ అయిన 32 ఏళ్ల సాహిల్ సిద్ధిఖీ తన ఇంట్లో పార్టీ పేరుతో ఆమెను ఆహ్వానించాడు. విద్యార్థులందరినీ పిలిచినట్లు అతడు చెప్పాడు.
కాగా, ఆ టీచర్ ఇంటికి చేరుకున్న ఆ బాలిక అక్కడ తాను మాత్రమే ఉన్నట్లు గ్రహించింది. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చిన టీచర్ సిద్ధిఖీ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. అతడి ఇంట్లో నిర్బంధించి పలుమార్లు రేప్ చేశాడు. ఒక పార్టీలో కెమిస్ట్రీ టీచర్ అయిన 39 ఏళ్ల వికాస్ పోర్వాల్ కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు హోలీ సందర్భంగా పేరెంట్స్ను కలిసేందుకు ఆ బాలిక తన ఇంటికి వెళ్లింది. దీంతో సిద్ధిఖీ ఆమెకు ఫోన్ చేశాడు. వెంటనే తిరిగి రాకపోతే ఆమె కుటుంబానికి హాని చేస్తానని బెదిరించాడు. అయితే సిద్ధిఖీ మరో విద్యార్థినిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ కేసులో అరెస్టైన అతడు బెయిల్పై విడుదలయ్యాడు. దీంతో ధైర్యం చేసిన ఆ యువతి గురువారం ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు సిద్ధిఖీతోపాటు మరో టీచర్ వికాస్ను అరెస్ట్ చేశారు. వారిద్దరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.