Tamil Nadu: తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు

800 గ్రాముల బంగారం, వోల్వో కారు ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధింపులు..;

Update: 2025-06-30 05:30 GMT

వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామలు నిత్యం వరకట్న వేధింపులు చేస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. ఇటు మనసు చంపుకుని బ్రతకలేక నవ వధువు తనువు చాలించింది. ఈ ఘోర విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

రిధన్య (27), వస్త్ర కంపెనీ యజమాని అన్నాదురై కుమార్తె. ఈ ఏడాది ఏప్రిల్‌లో కవిన్‌కుమార్‌(28) అనే యువకుడికిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, రూ.70లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. అంతేకాకుండా గ్రాండ్‌గా తిరుప్పూర్‌లో వివాహం జరిపించారు. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం రిధన్యను వేధిస్తూనే ఉన్నారు.

ఇక అత్తింటి వారి వేధింపులు భరించలేక రిధన్య కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆదివారం మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. మార్గమధ్యలో కారు ఆపి పురుగుల మందు సేవించింది. చాలా సేపు కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా రిధన్య నోటి నుంచి నురగ రావడం చూశారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.

ఇక చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్ మెసేజ్‌లు పెట్టింది. ఏడు ఆడియో సందేశాలను పంపించింది. తన నిర్ణయానికి క్షమాపణలు చెబుతున్నా.. నిత్యం అత్త గారింట్లో వేధింపులు భరించలేకపోతున్నాను.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రోజూ మానసిక హింసను భరించలేకపోతున్నానని.. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సందేశంలో పేర్కొంది. ‘‘నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోవడం లేదు. ఈసారి నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నేను ఈ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను.’’ అని రిధన్య మెసేజ్‌లో స్పష్టం చేసింది.

రిధన్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వెలుపల ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవిలను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Tags:    

Similar News