Covid 19 : విస్తరిస్తున్న కరోనా.. 7 వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి.;

Update: 2025-06-15 01:45 GMT

దేశంలో మరోసారి అడుగుపెట్టిన కరోనా రక్కసి.. అంతకంతకూ విజృంభిస్తోంది. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాతరోజులొస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. భారతదేశంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య సంఖ్య 7,121 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతో పాటు కరోనావైరస్ తో ఆరుగురు మరణించారు. అధికారిక డేటా ప్రకారం.. మహారాష్ట్రలో ఒకటి, కేరళలో 3, కర్ణాటకలో 2 మరణాలు సంభవించాయి. జనవరి నుంచి 74 మంది మరణించారు.

కేరళలో తాజాగా 170 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.. దీనితో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,223 కు చేరుకుంది.. గుజరాత్‌లో 114 కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 1,223 కి పెరిగింది. కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదై.. యాక్టివ్ కేసుల సంఖ్య 459కి పెరిగింది. గత 24 గంటల్లో ఢిల్లీలో 66 కేసులు నమోదయ్యాయని, నగరంలో మొత్తం కేసుల సంఖ్య 757 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏపీలో 72 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.. ఎలాంటి కేసులు నమోదు కాలేదు.. తెలంగాణలో ఒక కేసు నమోదు కాగా.. 11 యాక్టివ్ కేసులు ఉన్నాయి..

కేరళలో కోవిడ్-19 కారణంగా 87 ఏళ్ల మహిళ, ఇద్దరు పురుషులు (69, 78) మరణించారు.. వీరందరూ ఇతర వ్యాధులతో పోరాడుతున్నారు. కర్ణాటకలో అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ ఉన్న 51 ఏళ్ల మహిళ, అధిక రక్తపోటు ఉన్న 79 ఏళ్ల వ్యక్తి ఇన్ఫెక్షన్ల కారణంగా మరణించారు. మహారాష్ట్రలో, కోవిడ్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, బాధ, టాచీకార్డియా – సైనోసిస్‌తో బాధపడుతున్న 43 ఏళ్ల వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో మంగళవారం (జూన్ 10) తొలి కోవిడ్ మరణం నమోదైంది. రాష్ట్ర రాజధాని రాంచీలో 44 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడి మరణించాడని అధికారులు తెలిపారు. ఆయన రాజధాని నగరంలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)లో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News