ఒడిశా రైలు ప్రమాదం.. కవచ్ ఏమైంది
రైల్వేలకు సంబంధించిన ఈ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ అక్కడ లేదని అధికారులు తెలిపారు;
ఒడిశా రైలు ప్రమాదంతో అందరి దృష్టి కవచ్పైకి మళ్లింది. రైల్వేలకు సంబంధించిన ఈ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ అక్కడ లేదని అధికారులు తెలిపారు. అది ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.రైళ్లు సురక్షితంగా నడవడానికి కవచ్ అనే ఈ వ్యవస్థను రైల్వే ఆధ్వర్యంలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ మూడు భారతీయ సంస్థలతో పాటు తయారు చేసింది ఇందుకు దాదాపు 17 కోట్లు ఖర్చు అయింది.
అయితే అధునాతన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత రైల్వేల్లో అనేక సంస్కరణలు వచ్చాయి. ప్రధానంగా రైల్వే భద్రతకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి గుద్దుకోకుండా, మలుపుల వద్ద రైళ్ల వేగాన్ని లోకోపైలట్ నియంత్రించని సందర్భాల్లో ఆటోమేటిక్గా నియంత్రించేలా కవచ్ రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం పలు సందర్భాల్లో ప్రకటించింది. అయితే.. ఈ కవచ్ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదం సంభవించిన బాలోసోర్ రైలు మార్గంలో ఏర్పాటు చేయలేదని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు.
మరోవైపు ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. అయితే, రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టడాన్ని నివారించే కవచ్ వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించడం సాధ్యమయ్యేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేశారు. కవచ్ ఉన్నా ఈ ప్రమాదాన్ని నివారించేది కాదేమోనన్నారు. సిగ్నలింగ్ వైఫల్యంగా కనిపించడం లేదని. తొలి రైలు పట్టాలు తప్పడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని అన్నారు. అతివేగంతో వెళ్తున్నందున కోరమాండల్ ఎక్స్ప్రెస్ పైలట్ బ్రేకులు వేయలేకపోయారని సుదాన్షుమణి అన్నారు.