Opposition Patna Meet : BJPని ఢీకొనేందుకు విపక్షాల వ్యూహరచనలు.. అధికారపక్షం సెటైర్లు
2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా నేడు పట్నాలో విపక్ష నేతలు సమావేశమయ్యారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 15 ప్రధాన పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కావటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భేటీ అనంతరం ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
కేంద్రం ఇటీవలే తీసుకొచ్చిన సెంటర్ ఫర్ కంట్రోల్ ఆఫ్ సర్వీసెస్ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆప్ సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలిపినట్లు సమాచారం.
బిహార్లో ఫొటో సెషన్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
విపక్ష నేతల భేటీపై హోం మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. బిహార్లో నేడు ఫొటో సెషన్ జరుగుతోందని, ప్రధాని మోదీని ఓడించడానికి నేతలంతా ఒక్కటయ్యారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 300లకు పైగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్కు థ్యాంక్స్ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
పట్నాలో విపక్ష నేతల సమావేశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీకి నాయకులు మద్దతిస్తున్నారి ఎద్దేవా చేశారు.
'ప్రధాని మోదీని ఓడించే శక్తి కాంగ్రెస్కు లేదు, ఒంటరిగా పోటీ చేయలేక ఇతర పార్టీల మద్దతు కావాలని బహిరంగంగా ప్రకటించిన కాంగ్రెస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన విధానాన్ని స్వయంగా చూసిన నాయకులే నేడు కాంగ్రెస్తో భేటీ అవడం హాస్యాస్పదంగా ఉంది.'
- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
పార్టీల ఐక్యత కాదు.. ప్రజల ఐక్యత ముఖ్యం : మంత్రి కేటీఆర్
విపక్ష నేతల మీటింగ్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో కాంగ్రెస్, బీజేపీలు విఫలం అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదని విమర్శించారు. పార్టీల ఐక్యత కంటే ప్రజల ఐక్యత ముఖ్యమని పేర్కొన్నారు.
పట్నాలో జరుగుతున్న ఈ ముఖ్య భేటీకి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందలేదు. ఇటీవలే సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీష్ కుమార్తో భేటీ అయ్యారు. బీజేపీని ఎదుర్కునేందుకు కలిసి పోరాడుతామని మీడియా ముఖంగా తెలిపారు. కానీ, ఈ మీటింగ్కు కేసీఆర్ను పిలవకపోడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.