Kathmandu: నేపాల్ లో హింస, ఇద్దరి మృతి, 30 మందికి గాయాలు

రాచరిక పునరుద్ధరణ ఉద్యమంలో ..;

Update: 2025-03-29 07:30 GMT

హిమాలయ దేశం నేపాల్‌లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలనే డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అక్కడ గత కొంతకాలంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని ప్రజలు రాచరిక పాలన కోరుతూ మాజీ రాజు జ్ఞానేంద్ర షా  మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా అక్కడ హింస చోటు చేసుకుంది.

నేపాల్‌ రాజధాని ఖాట్మాండూ లోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రెచ్చిపోయారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఓ టెలివిజన్‌ ఆఫీసును, పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు, వాహనాలకు నిప్పంటించారు, దుకాణాలను దోచుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో సైన్యం రంగప్రవేశం చేసి నిరసనకారులను అడ్డుకుంది. ఈ ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 112 మంది గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 100 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేశారు.

కాగా, నేపాల్‌లో రాచరికం 2008లో అంతమైంది. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీరాజు జ్ఞానేంద్ర తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ వీడియో జారీ చేసినప్పటి నుంచి రాచరిక అనుకూల ఉద్యమం రాజుకుంది. దీని తరువాత దేశంలో ఆందోళనలు చెలరేగాయి.

Tags:    

Similar News