SNAKES: బ్యాగులో 47 కొండచిలువలు.. రెండు బల్లులు
తిరుచ్చి విమానాశ్రయంలో ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు;
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయం( Trichy airport )లో వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు(Customs officials) అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 47 కొండచిలువలు(47 pythons), 2 బల్లుల(2 lizards)ను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి మహమ్మద్ మొయిద్దీన్(Muhammad Moideen) అనే ప్రయాణికుడు తిరుచ్చి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. మొయినుద్దీన్ను అనుమానాస్పదంగా కనిపించడంతో.. అతని లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద 47 కొండచిలువలు, రెండు అరుదైన బల్లులను ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికుడు ట్రాలీ బ్యాగ్లో వీటిని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బాటిక్ ఎయిర్ విమానం(Batik Air flight)లో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే మొయినుద్దీన్ను అడ్డుకున్నామని... అతని బ్యాగ్లో వివిధ రకాల పరిమాణాల్లో సరీసృపాలను అనేక చిల్లులు గల పెట్టెల్లో దాచి ఉంచాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అటవీశాఖ అధికారులు(Forest officials ) విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సరీసృపాలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం మొయిద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు.