Bengaluru: రోగిని విచక్షణారహితంగా కొట్టిన సిబ్బంది
బెంగళూరు పునరావాస కేంద్రంలో దారుణం.;
బెంగళూరు సమీపంలోని ఒక పునరావాస కేంద్రంలో దారుణం జరిగింది. రిహేబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఓ రోగి పట్ల ఇద్దరు వ్యక్తులు కర్కశంగా ప్రవర్తించారు. రోగిపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా కొట్టిన తర్వాత రోగిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారింది.
వీడియోలో రోగిని ఓ గదిలో బంధించి ఇలా దారుణంగా కొట్టడం ఉంది. తనను కొట్టవద్దని ఎంత వేడుకున్నా కనికరించకుండా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ వ్యక్తిని పదే పదే ఈడ్చుకుంటూ వెళ్లడం... వెంటనే మరొక వ్యక్తి కర్రతో అతన్ని కొట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోగి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఈ ఘటన బెంగళూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలమంగళ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పునరావాస కేంద్రంలో జరిగినట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం... ఈ వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చింది. కానీ, ఈ సంఘటన చాలా రోజుల కింద జరిగిందని సమాచారం.
వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై సుమోటో కేసు నమోదు చేశారు. వార్డెన్ దుస్తులు, బాత్రూమ్లు క్లీన్ చేయాలని చెప్పగా రోగి నిరాకరించాడు. దాంతో ఆగ్రహించిన వార్డెన్, మరో వ్యక్తితో కలిసి అతనిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.