Lok Sabha Polls: నాలుగో దశ పోలింగ్కు అంతా రెడీ
ఓటర్లు ఎవరికి జై కొడతారో?;
సార్వత్రిక సమరంనాలుగో దశ పోలింగ్కు అంతా రెడీ సిద్ధమైంది. ఈ విడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. నాలుగో దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1,717మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నాల్గోవిడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల పరిధిలోని 96లోక్సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 8 చొప్పున, బిహార్లో 5, ఒడిశా, ఝార్ఖండ్లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్లో ఒక లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 13న జరిగే తొలివిడతలో ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మహారాష్ట్రలో సోమవారం పోలింగ్ జరిగే 11 స్థానాల బరిలో మొత్తం 298 మంది అభ్యర్థులు ఉన్నారు.మహారాష్ట్రలో ఈ దఫా ఎన్నికల్లో 2.28 కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 23,284 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. దేశంలో ఉత్తర్ప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ మొత్తం 48 లోక్సభ స్థానాలున్నాయి. ఇప్పటికే తొలి మూడు విడతల్లో 24 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది.
నాల్గోవిడతలో భాగంగా బిహార్లో దర్భంగా, ఉజియార్పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 55 మంది అభ్యర్థులు ఈ దఫా ఎన్నికల బరిలో ఉండగా వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు
ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 8 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపుర్ లోక్సభ స్థానం అందరిదృష్టిని ఆకర్షిస్తోంది.నాలుగో దశ పోరులో పశ్చిమ బెంగాల్లో 1.45 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 15, 507 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం అధికారులు సిద్ధం చేశారు.
ఉత్తర్ప్రదేశ్లో 13 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా...మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.46కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యప్రదేశ్లోని 8 స్థానాల్లో 74 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 1.62 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 18,007 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లోని మొత్తం 29 లోక్సభ స్థానాల్లో తొలి మూడు విడతల్లో 21 చోట్ల పోలింగ్ పూర్తయ్యింది. ఈ దశలో మిగిలిన స్థానాలకు ఓటింగ్ జరగనుంది