PM Modi: భారతరత్న కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించి బీహార్లో మోడీ ప్రచారం ప్రారంభం
బీహార్లో ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ బీహార్లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.
ప్రధాని మోడీ రెండు రోజుల పాటు బీహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెగుసరాయ్తో పాటు ఇతర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు.
గురువారం బీహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిని ‘లత్బంధన్’ కూటమి (నేరస్థుల కూటమి)గా పిలిచారు. ఆ కూటమిలో ఉన్నవారంతా బెయిల్పై బయటకు తిరుగుతున్నవారేనని పేర్కొన్నారు. ‘‘జంగిల్ రాజ్’’ను మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని.. ఆ కాలపు అనుభవాలను యువతరానికి అందించాలని కోరారు.. ప్రతిపక్షాలు తమ తప్పును దాచడానికి ఎంత ప్రయత్నించినా.. ప్రజలు దానిని క్షమించరన్నారు. ప్రతిపక్ష నేతలకు తమలో తాము ఎలా పోట్లాడాలో.. స్వప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో మాత్రమే తెలుసు అన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ, స్టార్టప్ హబ్లను సృష్టించాల్సిన అవసరం ఉందని.. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయని… యువత కీలక పాత్ర పోషించాలని మోడీ పేర్కొన్నారు.
కర్పూరి ఠాకూర్కు గత సంవత్సరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఆయన మరణించిన 35 సంవత్సరాల ఈ పురస్కరం లభిచింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ అవార్డు లభించింది. కర్పూరి ఠాకూర్ ఫిబ్రవరి 17, 1988న మరణించారు.
‘జన్నాయక్’ లేదా పీపుల్స్ లీడర్గా ఠాకూర్ పేరు సంపాదించారు. నాయి (బార్బర్) వర్గానికి చెందిన ఒక చిన్నకారు రైతు కుమారుడు. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిసెంబర్ 1970- జూన్ 1971 మధ్య భారతీయ క్రాంతి దళ్లో భాగంగా సీఎంగా పని చేశారు. డిసెంబర్ 1977-ఏప్రిల్ 1979 మధ్య జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పని చేశారు. మద్యపాన నిషేధానికి కూడా ఠాకూర్ ప్రసిద్ధి చెందారు. ఠాకూర్ ప్రజలచే ప్రేమించబడటమే కాకుండా ప్రతిపక్షాలచే కూడా గౌరవింపబడ్డారు.