ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలలో ఐదురోజులపాటు మోదీ పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో జూన్ 15-16 తేదీల్లో పర్యటిస్తారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత భారత ప్రధాని సైప్రస్లో పర్యటించనున్నారు. మోదీనే. పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన చర్చలు జరపనున్నారు. దీనితోపాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
జీ-7 సదస్సుకు హాజరు
ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16-17న కననాస్కిస్లో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఆరోసారి. ఇందులో భాగంగా జీ-7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. జీ-7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో(AI) అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాల గురించి చర్చలు జరపనున్నారు.