RSS Centenary Celebrations : భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ అంకితం : మోడీ
తపాలా బిళ్ల, నాణెంను విడుదల చేసిన ప్రధాని
ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని తపాలా బిళ్ల, నాణెంను విడుదల చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ముందుగా దేశ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సేవకులకు అభినందనలు చెప్పారు. గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే విజయం, ఆర్ఎస్ఎస్కు దేశమే ముఖ్యం అని చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు సంఘ్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. దేశమే ప్రథమం అనేది సంఘ్ విధానం అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సేవకులు నిస్వార్థంగా పని చేస్తారని ప్రధాని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను సంఘ్ రక్షిస్తోందని, దేశ అభివృద్ధిలో ఆర్ఎస్ఎస్ది కీలకమైన పాత్ర అని అన్నారు. సంఘ్ దేశాభివృద్ధి కోసమే పని చేస్తోందని, కొందరు ఆర్ఎస్ఎస్పై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆర్ఎస్ఎస్పై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. భారతమాత సేవకే ఆర్ఎస్ఎస్ అంకితమైందని వెల్లడించారు.
RSSను 1925లో నాగ్పూర్లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. ఆర్ఎస్ఎస్ అనేది స్వచ్ఛంద సేవా ఆధారిత సామాజిక, సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ విద్య, ఆరోగ్యం, విపత్తు ఉపశమనం, సామాజిక సేవలకు అనేక సహకారాలను అందించింది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన స్టాంపు, నాణెం ఈ సహకారాలను సూచిస్తాయి. రూ.100 నాణెంపై ఒక వైపు జాతీయ చిహ్నం, మరొక వైపు వరద భంగిమలో సింహంతో ఉన్న భారతమాత చిత్రం, భక్తితో ఆమెకు నమస్కరిస్తున్న స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో భారతమాత చిత్రం భారత కరెన్సీపై కనిపించడం ఇదే మొదటిసారి కావచ్చని చెబుతున్నారు. ఈ నాణెంపై RSS నినాదం కూడా ముద్రించి ఉంది.