బీహార్లో అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్లా పరిగెడుతోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎన్డీయే కూటమి తరుపున ఆయన బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదట ఇటీవల మరణించిన బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్విలాస్ పాశ్వాన్, రఘువంశ్ ప్రసాద్ సింగ్లకు నివాళులర్పించారు. గాల్వన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పాదాభివందనం చేశారు. తరువాత సాసరమ్లో జరిగిన తొలి ర్యాలీలో పాల్గొని ఎన్డీఏ ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో సీఎం నితీష్ కుమార్ శరవేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించే ఉంటే అనూహ్యమైన కల్లోలం జరిగుండేదన్నారు. కరోనా కాలంలో పేదల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు.
రాష్ట్రంలో తన ప్రభుత్వం వచ్చిన తరువాతే శాంతి భద్రతలు పెరిగాయన్నారు సీఎం నితీష్ కుమార్. పేద ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత తనదే అన్నారు.. మరోసారి బీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారన్నారు.. మూడు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి మొత్తం 12 సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగనున్నాయి.. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 పోలింగ్ జరగనుంది.. నవంబర్ పదిన ఓట్లు లెక్కిస్తారు.