బీహార్లో జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేగంగా గాంధీ మైదాన్లో ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం, రాహుల్ గాంధీ మద్దతు కోరడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్ దీక్షను తెల్లవారుజామున భగ్నం చేసి భారీ బందోబస్తు నడుమ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీకేజీ జరిగిందని అభ్యర్థులు గత నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా జనవరి 2న నిరసన ప్రారంభించారు. అదుపులోకి తీసుకునే ముందు, బీపీఎస్సీ అక్రమాలపై జనవరి 7న పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.