Sikkim: సిక్కిం సీఎంగా తమాంగ్‌ ప్రమాణం

వరుసగా రెండోసారి బాధ్యతలు;

Update: 2024-06-11 00:30 GMT

సిక్కిం సీఎంగా ఎస్కేఎం అధినేత ప్రేమ్‌సింగ్‌ కుమార్‌ తమాంగ్‌(56) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య గ్యాంగ్‌టక్‌లో ఆయన చేత ప్రమాణం చేయించారు. తమాంగ్‌ సిక్కిం పాలనా పగ్గాలు చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. తమాంగ్‌తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ను ఓడించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో చోటు దక్కింది. గతంలో తమాంగ్‌పై తిరుగుబాటు చేసిన మణికుమార్‌ శర్శను ఓడించిన నర్‌ బహదూర్‌ దహాల్‌ను కూడా మంత్రి పదవి వరించింది. అధికార పార్టీలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా క్యాబినెట్‌లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. తమాంగ్‌ నేతృత్వంలోని ఎస్కేఎం తాజా శాసనసభ ఎన్నికల్లో 32 స్థానాలకు గాను 31 సీట్లలో ఘన విజయం సాధించింది.

తమాంగ్‌ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. బంగాల్‌లోని దార్జీలింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 1990లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రాజకీయాలవైపు మళ్లారు. 1994లో పవన్‌ చామ్లింగ్‌తో కలిసి ఎస్‌డీఎఫ్‌ను స్థాపించారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2009 ఎన్నికల తర్వాత తమాంగ్‌కు పార్టీతో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలుపొందినా, పవన్‌ చామ్లింగ్‌ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. తన రాజకీయ గురువైన చామ్లింగ్‌ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ, ఆయనపై తిరుగుబావుటా ఎగురవేశారు. 2013లో సొంతంగా ఎస్‌కేఎంను స్థాపించారు.

2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎస్‌కేఎం 10 స్థానాలు దక్కించుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే 1994-1999 మధ్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.10 లక్షల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారన్న అభియోగంతో నమోదైన కేసులో తమాంగ్‌కు ఏడాది జైలుశిక్ష పడింది. 2018లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీకి పట్టం కట్టారు. 17 స్థానాలు గెల్చుకొని ఎస్‌కేఎం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తమాంగ్‌ సీఎం పీఠమెక్కారు. గత ఐదేళ్లలో తమాంగ్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.


Tags:    

Similar News