Narendra Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని..జూలై 2 నుంచి 9 వరకు
బ్రెజిల్లో బ్రిక్స్ సమ్మిట్కి నమీబియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనాలో పర్యటన..;
ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్లో జరిగి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్లోని అనేక కీలక దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో పర్యటిస్తారు.
ఎనిమిది రోజుల పర్యటనలో ప్రధాని మోడీ బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ టొబాకో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పర్యటనలో మొదటి దశలో ప్రధాని మోడీ జూలై 2 నుంచి 3 వరకు ఘనాలో పర్యటిస్తారు. మూడు దశాబ్దాల కాలంలో భారత నుంచి ఘనాకు వెళ్తున్న మొదటి ప్రధానిగా మోడీ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై చర్చలు జరుగుతాయి.
జూలై 3 నుంచి 4 వరకు రెండు రోజులు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తారు. 1999 తర్వాత భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో, ప్రధాని మోదీ ట్రినిడాడ్ మరియు టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ మరియు ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేసర్తో చర్చలు జరుపుతారు. ఆయన ద్వీప దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంలో కూడా ప్రసంగించే అవకాశం ఉంది.
జూలై 4 నుంచి 5మ వరకు అర్జెంటీనాను ప్రధాని మోడీ సందర్శిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు మరియు గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం మరియు పెట్టుబడి వంటి కీలక రంగాలలో భారతదేశం-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి అధ్యక్షుడు జేవియర్ మిలేతో ప్రధానమంత్రి విస్తృత చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ తెలిపింది.
దీని తర్వాత బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లనున్నారు. బ్రెజిల్లో జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి హోదాలో ప్రధాని మోదీ బ్రెజిల్కు ఇది నాల్గవ పర్యటన అవుతుంది. 17వ బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశం రియో డి జనీరోలో జరుగుతుంది. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అంశాలపై భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
మోడీ చివరగా నమీబియా వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నంది-నదిత్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నమీబియా పార్లమెంట్లో కూడా ప్రసంగించనున్నారు.