ఉగ్రవాదులను భారత జవాన్లు ముందుగానే కనిపెట్టారు : ప్రధాని మోదీ
26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి..;
26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్లో నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ... తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతోపాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటా సమీపంలో, బన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఎన్కౌంటర్పై ఈ సమావేశంలో చర్చించారు.
పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టడాన్ని ప్రధాని అభినందించారు. పెద్ద ఎత్తున మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో భారీ దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాదులను భారత జవాన్లు ముందస్తుగానే కనిపెట్టారని అన్నారు. భారీ వినాశనాన్ని అడ్డుకున్న భద్రతా దళాలను ప్రధాని మరోసారి కొనియాడారు.
గురువారం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదుల్ని కాల్చి చంపాయి. అటు ముంబై తరహదాడుల్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. నగ్రోటా ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు ఉగ్రవాదులూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. ఈ నలుగురు ఇటీవల భారత్లో అక్రమంగా చొరబడినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలను భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 19 వరకు 8 దశల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.