Kolkat : దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు
ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా;
కోల్కతా లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపిక సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పాటు అనేక ఇతర నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ‘నా పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నా. నన్ను తొలగించేందుకే కొందరు కుట్రపన్ని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాను. చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది. నేను కూడా ఓ పేరెంట్నే.. పేరెంట్గానే రిజైన్ చేస్తున్నాను’ అని డాక్టర్ ఘోష్ తెలిపారు. తాను ఓ ఆర్థోపెడిక్ సర్జన్ని అని జీవనోపాధి పొందగలనని ఈ సందర్భంగా ఘోష్ పేర్కొన్నారు. ‘సందీప్ ఘోష్ రాజీనామా చేయలేరని అందరూ అనుకున్నారు. నేను నిజాయితీ పరుడిని. ఈ బాధ్యతలు చేపట్టాక అవినీతిని అరికట్టాను. ఆసుపత్రి అభివృద్ధికి, రోగుల ప్రయోజనాలకు ఎంతో కృషి చేశాను’ అని వ్యాఖ్యానించారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు హాస్పిటల్తో ఎలాంటి సంబంధం లేని బయటి వ్యక్తి అని, ఘటన జరిగిన రోజు అతను దవాఖానలోని అన్ని విభాగాలలో స్వేచ్ఛగా తిరిగాడని పోలీసులు శనివారం తెలిపారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ నేరంతో అతడికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు వారు చెప్పారు.
అతడిని సెల్దా కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పోలీస్ రిమాండ్కు ఆదేశించింది. ఛాతీ వైద్య విభాగంలో పీజీ రెండో సంవత్సరం విద్యార్థిని అయిన బాధితురాలు గురువారం రాత్రి డ్యూటీలో ఉండగా ఆమెను హత్య చేశారు. సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా పడిఉన్న ఆమె దేహంపై గాయాల గుర్తులున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు డాక్టర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. అయితే వాస్తవాలు కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది ఒక దురదృష్టకర ఘటన అని, హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి తమ ప్రభుత్వం వెనుకాడదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.