Priyanka Gandhi: వయనాడ్ను వదులుకోనున్న రాహుల్
కేరళ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ ఫిక్స్!;
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకునే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకోవచ్చనే ప్రచారం మొదలైంది. ఆ స్థానం నుంచే ఆయన సోదరి ప్రియాంకా పోటీ చేయనున్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.... వయనాడ్ స్థానాన్ని వదులుకోవచ్చనే ప్రచారం మొదలైంది. ఆ స్థానం నుంచే ఆయన సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్... ఏ సీటు వదులుకోవాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా 2నియోజకవర్గాల ప్రజలు సంతోషిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే వయనాడ్ స్థానం ఖాళీ కావొచ్చని.. ఇటీవల కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్గాంధీ వయనాడ్కు మాత్రమే పరిమితం కావాలని అనుకోవట్లేదన్నారు. అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము బాధపడబోమని సుధాకరన్ అన్నారు. దీంతో రాహుల్ వయనాడ్ స్థానాన్ని వదులుకుని ఎన్నో ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్కు కంచుకోటలు. ఐతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ పరాజయంకాగా...రాయ్బరేలీలో సోనియా గాంధీ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ నుంచి భారీ మెజార్టీతో నెగ్గారు. ఈసారి సోనియాగాంధీ ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అమేఠీ లేదా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఐతే రాహులే వయనాడ్తో పాటు తమకు కంచుకోటైన రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగి రెండు చోట్లా గెలుపొందారు. అమేఠీ, రాయ్బరేలీలలో ప్రచార బాధ్యత మొత్తం ప్రియాంక గాంధీనే చూసుకున్నారు. ఆ రెండు చోట్లా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారంపై దృష్టి సారించేందుకే ప్రియాంకా పోటీకి దూరంగా ఉన్నట్లు అప్పట్లో కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకుంటే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అప్పుడు ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లడానికి మార్గం సుగమవుతుంది. తన సోదరిని ఆశీర్వదించాలని రాహుల్ వయనాడ్ ప్రజలను కోరనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేరళలో ఉన్న 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ఏకంగా 18 చోట్ల గెలుపొందింది. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అందుకే రాహుల్ వయనాడ్ను విడిచిపెట్టినా ప్రియాంక గాంధీని అక్కడ నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది