ED : ఆప్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు..

అరెస్టు చేస్తారని పార్టీ ఆరోపణ;

Update: 2024-09-02 06:00 GMT

తనను అరెస్ట్ చేసేందుకు ఈడీ బృందం ఇంటికి వచ్చిందని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్  తెలిపారు. దిల్లీ వక్ఫ్ బోర్డుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీలోని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజధానిలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే  అమనతుల్లా ఖాన్‌   ఇంటిపై ఈడీ అధికారులు సోమవారం ఉదయం దాడులు చేపట్టారు.

ఢిల్లీ వక్ఫ్ బోర్డు  చైర్మన్‌గా ఉన్న సమయంలో అక్రమ నియామకాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అమనతుల్లా ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఓఖ్లాలోని అమనతుల్లా ఇంటికి ఈడీ అధికారులు చేరుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఈడీ దాడులపై అమనతుల్లా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘నన్ను అరెస్ట్‌ చేసేందుకు ఈడీ అధికారులు ఇప్పుడే నా ఇంటికి వచ్చారు’ అంటూ పోస్ట్‌ పెట్టారు. మోదీ సర్కార్ తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. నిజాయితీగా ప్రజలకు సేవ చేయడం నేరమా..? అంటూ ప్రశ్నించారు. ఇంకెంత కాలం ఈ నియంతృత్వ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు.

మరోవైపు అమనతుల్లా ఇంటిపై ఈడీ సోదాలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. రాజకీయ కుట్రలో భాగంగా ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్‌సింగ్ ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ సోదాలు చేయడం దారుణమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి గొంతు నొక్కడమే ఈడీ పని అని ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు.

Tags:    

Similar News