Bharath Jodo Yatra 2: భారత్ జోడో యాత్ర-2.0కు రాహుల్ రెడీ
యాత్రను సెప్టెంబర్లో ప్రారంభించాలని భావిస్తోన్న యంత్రాంగం
కాంగ్రెస్లో కొత్త జోష్ నింపిన భారత్ జోడో కు కొనసాగింపుగా రెండో విడుతను ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఈ యాత్రను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. యాత్రను సెప్టెంబర్లో ప్రారంభించాలని భావిస్తోంది.కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సమన్వయ కమిటీ సమావేశమైంది.యాత్ర ప్రారంభ తేదీతో పాటు స్థలం ఎంపికపై తీవ్రంగా చర్చించారు.అంతకుముందు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర సాగగా..ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పునకు యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్. గుజరాత్లోని పోర్బందర్ నుంచి త్రిపురలోని అగర్తలా వరకు భారత్ జోడో యాత్ర-2 ను చేపట్టాలని భావిస్తోంది హస్తం పార్టీ.
మరోవైపు యాత్రను స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభించాలని కోరుతున్నారు కొంతమంది నేతలు . ఆ రోజు ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా భారీ ప్రచారం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన అధిష్ఠానం.. సెప్టెంబర్కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇక తొలి విడత భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైంది. సుమారు 12 రాష్ట్రాల్లో సాగిన ఈ యాత్ర.. 2023 జనవరి 30న కశ్మీర్లోని లాల్చౌక్లో ముగిసింది. ఈ సుదీర్ఘ యాత్ర 145 రోజుల పాటు 3వేల970 కిలోమీటర్ల మేర సాగింది.