RAHUL: మళ్లీ అదే బంగ్లాకు రాహుల్
రాహుల్కు మళ్లీ అదే బంగ్లా కేటాయించిన లోక్సభ హౌసింగ్ కమిటీ.... 12-తుగ్లక్ లేన్లో అధికారిక బంగ్లా కేటాయింపు...;
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi ) MP సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో గతంలో ఆయన ఖాళీ చేసిన ఇంటిని లోక్ సభ హౌసింగ్ కమిటి తిరిగి కేటాయించింది. దిల్లీలోని 12-తుగ్లక్ లేన్ లోని అధికారిక బంగ్లా(12, Tughlaq Lane bungalow )ను తిరిగి రాహుల్ కు కేటాయించిందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మార్చిలో పరువునష్టం కేసులో రాహుల్ కు సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు( disqualification as Lok Sabha ) వేసింది. ఏప్రిల్ లో రాహుల్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి 10 జన్ పథ్ లోని తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసంలో ఉంటున్నారు. తాజాగా రాహుల్ పై అనర్హత వేటును తొలగించిన నేపథ్యంలో తిరిగి అదే బంగ్లాను ఆయనకు కేటాయించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ హౌసింగ్ కమిటీ తిరిగి బంగ్లా కేటాయించినప్పటికీ.. ఆయన అందులోకి మారతారా లేదంటే తల్లితోపాటు 10 జన్ పథ్ లోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
గతంలో తాను నివాసం ఉన్న ఇంటిని లోక్ సభ హౌసింగ్ కమిటీ తిరిగి కేటాయించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. తనకు కేవలం అదొక్కటే కాదని, భారత్ మొత్తం తన ఇల్లేనని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు లోక్సభకు ఎన్నికైన రాహుల్ గాంధీ ఈ కాలంలో తనకు కేటాయించిన తుగ్లక్ లేన్లోకి 12వ నంబర్ బంగ్లాలోనే ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని ( Rahul Gandhi Asked to Vacate Bungalow ) గతంలో లోక్సభ అధికారులు రాహుల్కు నోటీసులు పంపించారు. ఈ బంగ్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని, తీపి గుర్తులను మర్చిపోలేనని అప్పట్లో రాహుల్ గుర్తు చేసుకున్నారు. అధికారుల ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 22న బంగ్లాను ఖాళీ చేశారు రాహుల్. ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఉంటున్న దస్ జన్పథ్కు మకాం మార్చారు.
మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్లోని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్లు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దైంది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీలుకు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను జులై 7న న్యాయస్థానం కొట్టేసింది. అనంతరం జులై 15న రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆయన్ను దోషిగా తేల్చడంపై స్టే విధించింది. ఫలితంగా లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది.