Bihar : బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర: కానిస్టేబుల్ కాలుపైకి ఎక్కిన జీప్..
బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. నవాడా జిల్లాలో జనసందోహం మధ్య సాగుతున్న యాత్రలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ జీప్ అనుకోకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ పాదాలపైకి ఎక్కింది. ఈ ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
కిక్కిరిసిన జనం, భద్రతా సిబ్బంది మధ్య వాహనం నెమ్మదిగా ముందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనం కింద కానిస్టేబుల్ చిక్కుకోవడంతో వెంటనే అప్రమత్తమైన ఇతర పోలీసులు, స్థానికులు జీప్ను వెనక్కి నెట్టి అతడిని బయటకు తీశారు. గాయపడిన కానిస్టేబుల్ కు వైద్య చికిత్స అందించారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాహుల్ గాంధీ స్పందించి, తన వలంటీర్లను సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు. అంతేకాకుండా, ఆయన స్వయంగా కానిస్టేబుల్ కు ఒక వాటర్ బాటిల్ అందించి.. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ కారు కానిస్టేబుల్ను 'నలిపివేసిందని' (క్రష్), అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. కాంగ్రెస్ యాత్రను 'క్రష్ జనతా యాత్రగా ఎద్దేవా చేశారు. వారసుడు కనీసం వాహనం దిగి ఆ కానిస్టేబుల్ను చూడలేదు అని పూనావాలా విమర్శించారు.
ఓటర్ అధికార్ యాత్ర' విశేషాలు
బీహార్లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ 'ఓటర్ అధికార్ యాత్ర'ను చేపట్టింది. గత ఆదివారం ససారంలో ప్రారంభమైన ఈ 16 రోజుల యాత్ర, 20కి పైగా జిల్లాల్లో 1300 కిలోమీటర్ల మేర సాగి సెప్టెంబర్ 1న పట్నాలో ముగుస్తుంది. ఈ యాత్రలో ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఈ యాత్రను ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక పోరాటంగా అభివర్ణిస్తోంది.