Rahul Gandhi: జోడో 'న్యాయ్ యాత్ర'కు బ్రేక్
పరువు నష్టం కేసులో యూపీ కోర్టుకు హాజరుకానున్నా రాహుల్ గాంధీ;
ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సుల్తాన్పూర్లోని స్థానిక కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. 2018లో గాంధీ తన ప్రసంగంలో కేంద్ర మంత్రి అమిత్ షాను హంతకుడు అని అభివర్ణించిన విషయం తెలిసిందే. తదనంతరం, కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం ఉదయం పాజ్ చేయబడి, అదే రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు."భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు ఉదయం పాజ్ అవుతుంది మరియు ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్గంజ్ నుండి తిరిగి ప్రారంభమవుతుంది" అని జైరామ్ రమేష్ తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే గత నెలలో గౌహతిలో రాహుల్ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ యాత్ర' సందర్భంగా అసోంలో ఘర్షణ జరిగింది. ఈ కేసులో రాహుల్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ సిక్దార్, కాంగ్రెస్ గౌహతి సిటీ యూనిట్ జనరల్ సెక్రటరీ రమణ్ కుమార్ శర్మ వంటి 11 మందికి అసోం సీఐడీసమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతలు విచారణకు రావాలని సీఐడీ తెలిపింది.
ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అసోం పోలీసు సీనియర్ అధికారి తెలిపారు. తాము CrPC సెక్షన్ 41A (CRPC) కింద ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్ గాంధీతో పాటు కెసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్, జైరాం రమేష్, శ్రీనివాస్ బివి, కన్హయ్య కుమార్, గౌరవ్ గొగోయ్, భూపేన్ కుమార్ బోరా, దేబబ్రత సైకియా సహా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు.
జనవరి 23న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర నేతల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల బారికేడ్ను బద్దలు కొట్టారు. యాత్ర ప్రధాన నగరమైన గౌహతిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించడంతో ఈ అడ్డంకులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేయాల్సి వచ్చినా బారికేడ్లు పగలకుండా కాపాడలేకపోయారు. ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు.