Madhya Pradesh: న్యూస్పేపర్ ముక్కల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
మధ్యప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం..
మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని న్యూస్పేపర్ ముక్కల్లో వడ్డించడం తీవ్ర వివాదానికి దారితీసింది. షియోపూర్ జిల్లా హల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని చెత్తాచెదారం మధ్య పిల్లలు నేలపై కూర్చుని పేపర్ ముక్కల్లో పెట్టిన ఆహారాన్ని తింటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈ వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకుంటూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దృశ్యాలు తన హృదయాన్ని కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. "దేశ భవిష్యత్తు అయిన అమాయక పిల్లలకు కనీసం ప్లేట్లలో భోజనం చేసే గౌరవం కూడా దక్కదా?" అని హిందీలో ప్రశ్నించారు.
గత 20 ఏళ్లుగా మధ్యప్రదేశ్ను పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం, చిన్నారుల కంచాలను కూడా దొంగిలించిందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. పిల్లల భవిష్యత్తును ఇలా నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ సిగ్గుపడాలని ఆయన మండిపడ్డారు.
ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. పీఎం పోషణ్ పథకం కింద ఆ పాఠశాలలో భోజనం అందించే కాంట్రాక్టు పొందిన స్వయం సహాయక బృందాన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం శనివారం నాడు అధికారులు హుటాహుటిన ఆ పాఠశాలకు స్టీల్ ప్లేట్లను పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది.