Indian Railways: రైల్వే కి పొగ పెట్టేసిన పొగ మంచు.. 20 వేల టికెట్ల రద్దు 1.22 కోట్ల నష్టం
రైళ్ల ఆలస్యం, రద్దు కారణంగా 20 వేల టికెట్ల రద్దు;
ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యం కావడం, కొన్ని రైళ్లు రద్దు కావడం వంటి కారణాలతో రైల్వే ఏకంగా రూ.1.22 కోట్లు నష్టపోయింది. మొరాదాబాద్ డివిజన్లో గతేడాది డిసెంబర్లో 20 వేల రిజర్వేషన్ టికెట్ల రద్దు కారణంగా ఈ నష్టం ఏర్పడింది. ఈ మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లించినట్టు మొరాదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాజ్కుమార్సింగ్ తెలిపారు. ఉత్తర భారతదేశంలోని అనేక జిల్లాల్లో దట్టమైన పొగమంచు కారణంగా భారతీయ రైల్వేల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
బరేలీలో 4,230, మొరాదాబాద్లో 3,239, హరిద్వార్లో 3,917, డెహ్రాడూన్లో 2,448 టికెట్లు సహా మొత్తం 20 వేల రద్దయ్యాయి. పొగమంచు పరిస్థితుల కారణంగా రైళ్లు రద్దు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా డిసెంబర్ 2023లో మొరాదాబాద్ డివిజన్లో 20 వేల టికెట్లు కూడా రద్దు చేశామని రాజ్కుమార్ తెలిపారు. మార్చి వరకు 42 రైళ్లు క్యాన్సిల్ కావడంతో రూ. 1.22 కోట్లు వెనక్కి చెల్లించినట్టు వివరించారు.
పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను రద్దు చేశామని సింగ్ పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6 వరకు రాత్రి, ఉదయం చాలా గంటలపాటు దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.