Meghalaya: సోనమ్‌కు సంబంధించిన కీలక ఆధారం లభ్యం!

సీబీఐ దర్యాప్తు, ఆర్మీ సహాయం కోరుతున్న మృతుడి కుటుంబం;

Update: 2025-06-05 04:27 GMT

మేఘాలయలో తప్పిపోయిన ఇండోర్ మహిళ సోనమ్‌కు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలో సోనమ్‌కు సంబంధించిన రెయిన్ కోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు. అయితే ఆ రెయిన్ కోట్ సోనమ్‌దా? కాదా? అని నిర్ధారిస్తున్నట్లు చెప్పారు. సీసీకెమెరాలో ఆమె రెయిన్ కోట్ వేసుకున్నట్లు కనిపించింది. దొరికిన రెయిన్ కోట్ ఆమెదేనా? కాదా? అని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వచ్చారు. మూడు రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంతైంది. దీంతో బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు జల్లెడ పట్టగా 10 రోజుల తర్వాత తూర్పు ఖాసీ హిల్స్ కొండ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడిపై ఉన్న గాయాలతో ఎవరో చంపినట్లుగా నిర్ధారించారు. కానీ అతడి భార్య సోనమ్ ఆచూకీ లభించలేదు. తాజాగా ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ దొరికింది. దానిపై రక్తపుమరకలు ఉన్నాయి. దీంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆ రెయిన్ కోట్ ఆమెదేనా? కాదా? అని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఇక ఆమె జాడ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే తాజాగా సోనమ్ అదృశ్యానికి కొన్ని గంటల ముందు అత్త గారితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. సోనమ్‌కు అత్త గారు ఫోన్ చేసింది. ‘‘ఎలా ఉన్నావు కూతురా?’’ అని అడిగింది. ‘‘నేను ఆహారం సిద్ధం చేస్తున్నాను. ఈ రోజు మీ ఉపవాసం అని నాకు గుర్తుంది. మీరు ఉపవాసం ఉన్నారా? గుర్తుందా? అని అడిగింది. దీనికి సోనమ్ బదులిస్తూ.. ‘‘అవును.. ప్రయాణం వల్ల నేను ఉపవాసం ఉండనని స్పష్టంగా చెప్పాను.’’ అని జవాబు ఇచ్చింది. తిరిగి అత్తగారు మాట్లాడుతూ.. కొంచెం ఆహారం తీసుకోండి అని సూచించింది. దీనికి సోనమ్ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం తాను ట్రెక్కింగ్ చేస్తున్నానని.. అడవిలో ఏం దొరకదని తెలిపింది. ఇది చాలా కఠినమైన ప్రయాణం అని.. నేను ఎక్కిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. ఎక్కడం నిటారుగా ఉంది. నేను అతనికి (రాజా) వెళ్లవద్దని చెప్పాను. కానీ అతను ఎప్పుడూ వినడు. నేను అలసిపోయాను. ఇక్కడ ఆహారం కూడా బాగా లేదు. నడుస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టం.’’ అని సోనమ్ చెప్పింది. ఇలా రెండు నిమిషాల పాటు అత్తాకోడలి మధ్య సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది.

మరో క్లిప్‌లో రాజా రఘువంశీ తన తల్లితో మాట్లాడుతుండటం వినిపించింది. ఇప్పుడే శిఖరానికి చేరుకున్నామని.. పండ్లు తింటున్నట్లు తల్లికి చెబుతాడు. అతని తల్లి.. మిస్ అవుతున్నానని అతనితో చెబుతుంది. ‘‘నువ్వు పర్వతం పైకి ఎందుకు వెళ్ళావు? వీడియో ఎందుకు షేర్ చేయలేదు?’’ అని తల్లి అడిగింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదని రాజా సమాధానమిస్తాడు. అప్పుడు అతని తల్లి.. ఎప్పుడు తిరిగి వస్తారని అడిగింది. దానికి అతను జవాబు ఇస్తూ.. రెండు రోజుల ప్రయాణం మాత్రమే మిగిలి ఉందని.. తర్వాత వస్తామని బదులిచ్చాడు

ఇక రాజా రఘువంశీ మృతదేహం దగ్గర కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ తెల్ల చొక్కా.. పెంట్రా 40 మందుల స్ట్రిప్, వివో మొబైల్, ఎల్‌సీడీ స్క్రీన్ భాగం, స్మార్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వాహనం అద్దెకు తీసుకున్న 25 కిలోమీటర్ల దూరంలో రాజా మృతదేహం గుర్తించారని.. అంటే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ముందే ఆలోచించినట్లు సోదరుడు విపిన్ రఘువంశీ తెలిపారు. కొత్త జంట ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నట్లు చెప్పారు. కానీ తన వాదనను పోలీసులు పట్టించుకోలేదన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. జంట ఆచూకీ చెబితే రూ.5లక్షల ఇస్తామని కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.

Tags:    

Similar News