Raj Kumar Goyal: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణం
రాష్ట్రపతి భవన్లో రాజ్ కుమార్తో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్మ
ప్రధాన సమాచార కమిషనర్గా (సీఐసీ) రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాజ్ కుమార్ గోయల్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు హజరయ్యారు.
రాజ్ కుమార్…
రాజ్ కుమార్ గోయల్ గతంలో కేంద్ర ప్రభుత్వ మాజీ హోం సెక్రటరీగా, లా సెక్రటరీగా పని చేశారు. పలు ముఖ్యమైన పదవులు కూడా నిర్వహించారు. రాజ్ కుమార్.. 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇటీవలే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. గత సెప్టెంబర్లో హీరాలాల్ సమరియా పదవీ కాలం ముగియడంతో సీఐసీ పోస్టు ఖాళీ అయింది. అదనంగా 8 మంది కొత్త సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరంతా త్వరలో కొత్త సీఐసీ ముందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలు పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 13వ తేదీన ప్రస్తుత సీఐసీ హీరాలాల్ సమారియా రిటైర్ కావడంతో అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్గోయల్ను సీఐసీ పదవికి ఎంపికచేశారు. కొత్త కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించాక దాదాపు 9 ఏళ్ల తర్వాత కమిషన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేయనుంది. బుధవారం 8 మందిని ఐసీలుగా సిఫార్సుచేయగా ఇప్పటికే ఆనందీ రామలింగం, వినోద్ కుమార్ తివారీలు ఐసీలుగా పనిచేస్తున్నారు.
సమాచార కమిషనర్(ఐసీ) పోస్ట్కు ప్రభుత్వం ఎంపికచేసిన 8 మందిలో సీనియర్ పాత్రికేయులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డ్లో లీగల్ సభ్యురాలైన రేలంగి సుధారాణి, మాజీ రైల్వేబోర్డ్ చీఫ్ జయవర్మ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, సెంట్రల్ సెక్రటేరియట్ సరీ్వస్ మాజీ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్, మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఇండియన్ ఫారెస్ట్ అధికారి కుష్వంత్ సింగ్ సేథీ ఉన్నారు.