Rajya Sabha: వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికకు రాజ్యసభ ఆమోదం
తీవ్ర ఉద్రిక్తతల మధ్య బిల్లుకు ఆమోదం తెలిపిన చైర్పర్సన్;
వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు 2024 సవరణ బిల్లుపై నివేదికను ‘జేపీసీ’ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) గురువారం రాజసభలో సమర్పించింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పొడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. మొత్తానికి తీవ్ర నిరసనల మధ్యే రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖర్ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
జేపీసీ నివేదికను రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. జేపీసీ నివేదికలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అభ్యంతరాలను నివేదిక నుంచి తొలగించారని ఆరోపించారు. జేపీసీ నివేదికను తిరిగి వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. ఏకాభిప్రాయం సాధించాకే బిల్లు ఆమోదించాలని కోరారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కేంద్రం పని చేస్తోందని ధ్వజమెత్తారు. నకిలీ నివేదికను ఎప్పటికీ అంగీకరించబోమని ఖర్గే స్పష్టం చేశారు.