Dense Fog: ఢిల్లీలో రెడ్ అలర్ట్.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు
రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీ ని దట్టమైన పొగమంచు కమ్మేసింది . దీంతో దృశ్యమానత జీరోకు పడిపోయింది . అతి సమీపంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. ఈ కారణంగా రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా దట్టమైన పొగ కమ్మేయడంతో ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే దాదాపు 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇవాళ ఉదయం 148 విమానాలు రద్దైనట్లు అధికారులు తెలిపారు. అందులో 78 అరైవల్స్ కాగా, 70 డిపార్చర్స్ ఉన్నాయి. మరో రెండు విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపిందని, ఈ కారణంగా విమానాలు ఆలస్యం, రద్దుకు దారి తీస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు ప్రయాణికులు తమ విమాన స్టేటస్ కోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. మరోవైపు తీవ్రమైన పొగమంచు కారణంగా పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.