Jairam Ramesh: ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎప్పుడు అంగీకరించలేదని ఆరోపించిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబాలేపై తీవ్రంగా మండిపడిన జైరాం రమేశ్..;
భారత రాజ్యాంగ పీఠిక నుంచి ‘లౌకికవాదం’, ‘సోషలిస్ట్’ అనే పదాలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గురువారం నాడు డిమాండ్ చేశారు. అలాగే, 50 ఏళ్ల క్రితం అత్యవసర పరిస్థితిని విధించినందుకు హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో హోసబాలే వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని “ఎప్పుడూ” అంగీకరించలేదని ఆరోపించారు. అలాగే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూతో సహా దాని వ్యవస్థాపక పితామహులపై దాడులు చేస్తుందని ఆర్ఎస్ఎస్ను విమర్శించారు.
ఇక, రాజ్యాంగంపై ఉద్దేశపూర్వకంగానే ఆర్ఎస్ఎస్ దాడి చేస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. అయితే, ఆర్ఎస్ఎస్, బీజేపీ పదే పదే కొత్త రాజ్యాంగం కోసం పిలుపునిచ్చాయని గుర్తు చేశారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ మోడీ ప్రచార నినాదంలో ప్రస్తావించడంతో.. ప్రజలు వారిని చోట్ల తిరస్కరించారు అన్నారు. అయినప్పటికీ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మార్చాలనే డిమాండ్లు ఇప్పటికీ వాళ్లు కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. న్యాయమైన, సమగ్రమైన, ప్రజాస్వామ్య భారతదేశం కోసం డాక్టర్ అంబేద్కర్ దార్శనికతను పడగొట్టడానికి దీర్ఘకాలిక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ మాటల్లోనే చెప్పాలంటే, రాజ్యాంగం మనుస్మృతి నుంచి ప్రేరణ పొందలేదని ఎద్దేవా చేశారు జైరాం రమేశ్.