Sabarimala: నేటి నుంచి శబరిగిరీశుని దర్శనం.. వీరికి మాత్రమే ..

మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం..

Update: 2024-02-14 00:45 GMT

పరమ శివునికి ప్రీతి పాత్రమైన మాసి మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెరిచారు. అయితే భక్తులకు మాత్రం బుధవారం నుంచి దర్శనాలు ఉంటాయని ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి ఐదు రోజుల పాటు శబరిమల ఆలయం భక్తుల దర్శనాల నిమిత్తం తెరిచి ఉంటుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. అయితే ఈ 5 రోజుల్లో అయ్యప్పను దర్శించుకోవడానికి ఆన్‌లైన్‌ బుకింగ్ తప్పనిసరి అని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. బుకింగ్ లేని వారికి దర్శనాలు లేవని తేల్చి చెప్పింది.

బుధవారం ఉదయం నుంచి ఈ నెల 18 వ తేదీ వరకు శబరిమలలో మాసి మాస పూజలు జరగనున్నట్లు శబరిమల ఆలయ పూజారులు వెల్లడించారు. ఈ 5 రోజుల పాటు సాధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే భక్తుల దర్శనాల కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ ఏర్పాటు చేసినట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. దీంతోపాటు నీలక్కల్, ముంబైలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రకటించింది. మంగళవారం సాయంత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరిచిన ఆలయ పూజారులు ఎలాంటి పూజలు నిర్వహించరు. ఆలయాన్ని మళ్లీ మూసివేసి బుధవారం ఉదయం తెరిచి పూజలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తారు.


ఈ 5 రోజుల్లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 5 గంటలకు నెయ్యి అభిషేకం ప్రారంభించి రాత్రి వరకు వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు. బుధవారం నుంచి ఈ నెల 18 వ తేదీ వరకు రోజూ రాత్రి 7 గంటలకు అయ్యప్పకు పడిపూజ నిర్వహిస్తారు. ఇక 18 వ తేదీ రాత్రి నిత్యపూజల అనంతరం హరివరాసనం ఆలపించి ఆలయాన్ని మళ్లీ మూసివేయనున్నారు. తి మాసి మాసం ప్రారంభంలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు కేవలం కేరళ నుంచే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 

Tags:    

Similar News