Sabarimala Temple: ఇక నుంచి ఆన్లైన్లో అయ్యప్ప దివ్య ప్రసాదం
శబరిమలతో పాటు ప్రధాన దేవాలయాల్లో సౌకర్యం
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప స్వామి వారి దివ్య ప్రసాదం కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అసవరం లేదు. ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాలను బుక్ చేసుకునే సదుపాయంను ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కలిపిస్తోంది. ఈ సదుపాయం మరో నెలలో అమలులోకి రానుంది. టీడీబీ ప్రారంభించిన కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సాయంతో శబరిమలతో పాటు ట్రావెన్కోర్ పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు తమ ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు.
టీడీబీ తన కార్యకలాపాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈ ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. కొట్టారక్కర శ్రీ మహాగణపతి ఆలయంలో కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్.. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ… ‘శబరిమల లాంటి రద్దీగా ఉండే దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ నెల లోపు అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. ముందుగా శబరిమలతో పాటు ప్రధాన దేవాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఆపై ఆరు నెలల్లో 1252 దేవాలయాలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.