CAG: కాగ్ నూతన అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
బాధ్యతలు చేపట్టిన తెలుగు అధికారి..;
ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతిగా ఈరోజు (గురువారం) ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించింది. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్మూర్తి అరుదైన రికార్డ్ సృష్టించారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్.. 1964 డిసెంబర్ 24న జన్మించారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్కు ఎన్నికై.. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం అమలులో సంజయ్ మూర్తి కీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఇక, కొండ్రు సంజయ్ సేవలను గుర్తించిన మోడీ సర్కార్ ఈ కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు లేదా.. 65 ఏళ్ల వయసు వరకు కొనసాగే అవకాశం ఉంది. సంజయ్మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్సభకు గెలిచారు. అంతకు ముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర సర్కార్ లో కార్యదర్శి స్థాయిలో సేవలను అందించారు.