Sasikala: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్న చిన్న‌మ్మ‌

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వారం రోజుల్లో కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానన్న శశికళ

Update: 2026-02-26 06:30 GMT

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తన రాజకీయ పునరాగమనాన్ని ఖాయం చేస్తూ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తన కొత్త రాజకీయ పార్టీ పేరును వెల్లడిస్తానని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ క‌చ్చితంగా పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.

చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె, పార్టీ ప్రారంభానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. "వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం. పొత్తుల కోసం కూడా చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు కచ్చితంగా ఒక మంచి నిర్ణయానికి దారితీస్తాయి" అని శశికళ పేర్కొన్నారు. అయితే, ఏ పార్టీలతో చర్చలు జరుపుతున్నారనే వివరాలను వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. ఈ వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.

ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీ నిర్మాణం సవాలుగా మారదా? అని విలేకరులు ప్రశ్నించగా శశికళ ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానం, ప్రజా జీవితం గురించి తమిళనాడు ప్రజలకు బాగా తెలుసని, కాబట్టి పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శశికళ ప్రకటనను రాజకీయ విశ్లేషకులు ఒక ముఖ్యమైన పరిణామంగా చూస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేసిన తరుణంలో శశికళ రాకతో కొత్త రాజకీయ సమీకరణాలు, పొత్తుల వ్యూహాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా నిన్న‌ కన్నుమూసిన సీపీఐ సీనియర్ నేత ఆర్. నల్లకన్నుకు శశికళ నివాళులర్పించారు. ఆయన పేదల సంక్షేమానికే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడని ఆమె కొనియాడారు. ఎంపీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ ఏ పదవి చేపట్టకపోయినా, తన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి వరకు నిలిచారని గుర్తు చేసుకున్నారు. "ఆయన అందరితో ఆప్యాయంగా ఉండేవారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు, ఆయన ఉద్యమానికి తీరని లోటు" అని శశికళ విచారం వ్యక్తం చేశారు. తాజా ప్రకటనతో రాబోయే నెలల్లో తమిళనాట రాజకీయ కార్యకలాపాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News