Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై పిల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి-పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం;
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషనర్ను మందలించింది. పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని అసహనం వ్యక్తం చేసింది.
ఇది కష్టకాలం అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ను విచారించడానికి కోర్టు నిరాకరించింది. పహల్గామ్ దాడిని రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని మీరు డిమాండ్ చేశారని కోర్టు పిటిషనర్కు తెలిపింది. ఇలాంటి కేసులను దర్యాప్తు చేయడంలో న్యాయమూర్తులు ఎప్పటి నుంచి నిపుణులుగా మారారు? వారు తీర్పు మాత్రమే చెప్పగలరు. మమ్మల్ని ఆర్డర్ జారీ చేయమని అడగకండి అని పిటిషనర్ను కోర్టు మందలించింది. ఈ విషయం యొక్క తీవ్రతను చూడండి అని సుప్రీంకోర్టు చెప్పింది.